సరిహద్దులలో 75 మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్

సరిహద్దులలో 75 మౌలిక అభివృద్ధి సంబంధిత ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. తూర్పు లద్థాఖ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో వీటిని జాతికి అంకితం చేశారు. 

దేశంలో జమ్మూ కశ్మీర్ మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉందని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్షానికి గురైందని, దీనితోనే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రస్థాయి ఉగ్రవాద బెడద నెలకొందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులతో జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్ధాఖ్ ప్రాంతాలకు మేలు జరుగుతుంది.

ఇప్పుడు ఈ ప్రాంతంలో త్వరితగతిన వికాసం నెలకొనేందుకు వీలుగా 75 కొత్త పనులను చేపట్టినట్లు వివరించారు. వంతెనలు, రహదార్లు , సరిహద్దు ప్రాంతాలలో హెలీపాడ్స్‌ను ఏర్పాటు చేసే దిశలో ఈ పనులు సాగుతాయని రక్షణ మంత్రి తెలిపారు. రూ 2180 కోట్ల విలువైన ఈ ఇన్‌ఫ్రా పనులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నట్లు మంత్రి ఈ నేపథ్యంలో చెప్పారు. 

తూర్పు లద్ధాఖ్‌లోని అత్యంత కీలకం, వ్యూహాత్మక ప్రాంతం అయిన డర్బక్ షోయక్ దౌలత్‌బేగ్ ఓల్డీ (డిఎస్ డిబిఒ) రోడ్ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ పనుల వల్ల ఆరు సరిహద్దు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైనది 14000 అడుగుల ఎత్తున దుర్భేధ్యపు కొండలలో నెలకొనే 120 మీటర్ల పొడవైన షోయక్ సేతు వల్ల సాయుధ బలగాలు వేగంగా తరలి వెళ్లేందుకు వీలేర్పడుతుంది.

ఈ ప్రాంతంలో 45 బ్రిడ్జిలు, రెండు హెలీపాడ్లు, 27 రహదారులు ఏర్పాటు అవుతాయి. దేశ భద్రతా అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు మారుమూల ప్రాంతాలలో ప్రాధమిక మౌలిక వసతుల ఏర్పాట్లు, సరైన విధంగా సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలోని వారికి అవసరం అయిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు కావడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు వెంటనే స్పందించేలా ఇప్పటి పనులు ఉపకరిస్తాయని మంత్రి తెలిపారు.