ముంబై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన ఎన్ హెచ్ ఎ ఐ డిబెంచర్లు

ముంబై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  లిస్ట్  అయిన ఎన్ హెచ్ ఎ ఐ డిబెంచర్లు

ముంబై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో   భారత జాతీయ రహదారుల  నిర్వహణ   సంస్థ (ఎన్ హెచ్ ఎ ఐ) ఇన్విట్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లిస్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా  శుక్రవారం ముంబైలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బెల్ మోగించారు.

బెల్ మోగడంతో భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ  ఇన్విట్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల జాబితా లాంఛన ప్రాయంగా ప్రారంభమయింది. భారత జాతీయ రహదారుల  నిర్వహణ   సంస్థపై నమ్మకం, విశ్వాసం ఉంచి అద్భుతమైన ప్రతిస్పందన చూపించిన సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారులకు  ఈ సందర్భంగా  గడ్కరీ కృతజ్ఙతలు  తెలిపారు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇన్విట్ ఎన్‌సిడిలు లిస్ట్ అవడం  చరిత్రాత్మకమని గడ్కరీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు పెట్టుబడులతో ప్రజల భాగస్వామ్యానికి ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు.  రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 25% ఎన్‌సిడిలను రిజర్వ్ చేశామని ఆయన వివరించారు.  రౌండ్ 2 ప్రారంభమైన కేవలం 7 గంటల్లో ఇన్విట్  దాదాపు 7 రెట్లు  ఓవర్‌ సబ్‌స్క్రైబ్ చేయబడింది. 

ఇన్విట్ అత్యధిక విశ్వసనీయతతో సంవత్సరానికి 8.05% ప్రభావవంతమైన రాబడి  అందిస్తుందని  గడ్కరీ పేర్కొన్నారు.  రిటైల్ ఇన్వెస్టర్లకు (రిటైర్డ్ సిటిజన్లు, జీతాలు తీసుకునే వ్యక్తి, చిన్న, మధ్యతరహా వ్యాపార యజమానులు) జాతి నిర్మాణంలో పాల్గొనే అవకాశం   భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ ఇన్విట్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు  అందిస్తాయని ఆయన తెలిపారు.  

కనీస పెట్టుబడి స్లాబ్ కేవలం రూ. 10,000 రూపాయలు వరకు  మాత్రమే ఉంటుందని  ఆయన స్పష్టం చేశారు. రహదారుల మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో పెట్టే పెట్టుబడిపై  అంతర్గత రాబడి రేటు   ఎక్కువగా ఉంటుందని  గడ్కరీ వివరించారు.  26 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, అనేక ఇతర ప్రాజెక్టులు వివిధ దశల్లో  ఉన్నాయని, ఇవి మరిన్ని పెట్టుబడి అవకాశాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను   5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ   దార్శనికతను సాకారం చేసేందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి తమ సహకారం అందించాలని ఆయన పెట్టుబడిదారులను కోరారు.

ఆర్థికంగా లాభదాయకంగా ఉండే   మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు   మంచి రాబడిని ఇస్తాయని ఆయన చెప్పారు. ప్రధాని  మోదీ ఆశిస్తున్న ఆత్మనిర్భర భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి బాండ్లు ఒక గొప్ప అవకాశం అందిస్తాయని  గడ్కరీ భరోసా ఇచ్చారు.

మౌలిక సదుపాయాలపై ముఖ్యంగా రహదారులపై పెట్టే భారీ పెట్టుబడులు  దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని ఆయన చెప్పారు.  తదుపరి రౌండ్లలో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు పాల్గొని క్రమంగా సంస్థాగత పెట్టుబడిదారులను అధిగమిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు