స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి… ఈసీకి ఫిర్యాదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం ఓ పెద్ద జిమ్మిక్కు అని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన కాపీని లేఖకు జతపరచామని రఘనందన్ రావు తెలిపారు.
 
మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేందుకు సదరు పోలీసు అధికారి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు ఈసీని కోరారు. 
 
మరోవంక, రఘునందన్ రావు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌ ఎపిసోడ్‌ కేసులో జోక్యం చేసుకోవాలని ఈడీని కోరినట్లు తెలిపారు. దీనిపై చర్యలు చేపడతామని ఈడీ అధికారులు రఘునందన్ రావుకు తెలిపినట్లు సమాచారం. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఆయన ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు.
 
 కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 
 
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తమ పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు ఆరోపణలు చేస్తున్నందున వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జనరల్ సెక్రెటరీ  అరుణ్ సింగ్ తదితరులు  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
 
ఇలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలుల విషయంలో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధమని ప్రశ్నించారు. నెంబర్ 1,  నెంబర్ 2 ఎవరు లేరని అంతా భోగస్ అని కిషన్  రెడ్డి తేల్చి చెప్పారు.
 
 మునుగోడు ఉపఎన్నికను ఆపాలని ఈసీని కోరలేదని కఠినంగా ఉండాలని మాత్రమే ఈసీని కోరినట్టుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఫామ్ హౌస్  ​లో డబ్బు దొరికితే…అసలు ఎంత దొరికింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అనేది ఎందుకు బయటపెట్టడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.