చంద్రయాన్‌ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధం

చంద్రయాన్‌ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమ్‌ నాథ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్‌లో రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తుది ఏర్పాట్లలో భాగంగా చిన్నచిన్న పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. 
 
జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్రో చైర్మన్‌ మాట్లాడారు. చంద్రయాన్‌-2 తో పోలిస్తే చంద్రయాన్‌-3 మిషన్‌ను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌ చివరి క్షణంలో ఫెయిల్‌ అయింది. 
 
చంద్రుడిపైన దిగే సమయంలో ల్యాండర్‌ తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెయిల్యూర్‌ నేర్పిన పాఠాలతో చంద్రయాన్‌-3 మిషన్‌ను తీర్చిదిద్దినట్లు సోమ్‌ నాథ్‌ తెలిపారు. 
 
చంద్రయాన్‌-2కు చంద్రయాన్‌-3 కి సంబంధం లేదని, గతంలోలాగా సమస్యలు తలెత్తకుండా మరింత సమర్ధంగా దీన్ని తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే గగన్‌ యాన్‌ ప్రాజెక్టుపై ఇస్రో పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 2024లో చేపడతామని తెలిపారు.