ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు

ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు
తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై అయిదేళ్ల నిషేధాన్ని విధించించి పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఈసీ తెలిపింది.  తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేల్చారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. అయిదేళ్ల వరకు ఆయన పార్లమెంట్‌ ఎన్నికకు అనర్హుడు.
అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63 (1) (పి) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా .. దానికి అర్హత ఉండదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ సికందర్‌ సుల్తాన్‌ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

తీర్పు ప్రకారం తోషాఖానా కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఇమ్రాన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఖండించింది. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ నేతలు తెలిపారు.

తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి గిఫ్ట్స్‌ వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్‌కు చెప్పాల్సి ఉంటుంది. కానీ పీటీఐ ప్రభుత్వం హయాంలో ఇమ్రాన్‌కు వచ్చిన బహుమతుల లెక్క తేలలేదు.  ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతుల్ని అమ్ముకున్నట్లు ఇమ్రాన్‌ కేసు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారు. ఇమ్రాన్‌ అమ్మినవాటిలో రిస్ట్‌ వాచ్‌లు, ఖరీదైన పెన్‌, రింగ్‌తో పాటు రోలెక్స్‌ వాచీలు ఉన్నాయి.