మరో పాకిస్థాన్‌ డ్రోన్‌ కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్‌ వైపు నుంచి ఒక డ్రోన్‌ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది. గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో అది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.

ఆ ఆక్టా కాపర్‌ సుమారు 12 కిలోల బరువు ఉన్నదని చెప్పారు. అది ఓ కన్సైన్‌మెంట్‌ తీసుకురావడాన్ని గుర్తించారు. అయితే అందులో ఏమున్నాయనే విషయాన్ని అధికారులు తెలియ జేయలేదు.

కాగా, మూడు రోజుల క్రితం (అక్టోబర్‌ 14న) గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో భద్రతా దళాలు ఓ డ్రోన్‌కు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్‌ రావడాన్ని గుర్తించిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. 

దీంతో గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి మొత్తం 193 డ్రోన్లు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.