దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్లో వ్యాక్సినేషన్ కోసం చేసిన కేటాయింపులో ఇది 85 శాతం కావడం గమనార్హం.
మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 1.8 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల పాటు వ్యాక్సినేషన్ను కొనసాగించేందుకు ఇవి సరిపోతాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు నిండుకుపోయినా, మార్కెట్లో వీటి లభ్యత ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా టీకాల డోసులను సేకరించాలా? వద్దా? అనే విషయమై ఆరు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 2021న దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితం గానే టీకాలు అందిస్తోంది. ఇప్పటివరకు 219 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
దేశ వ్యాప్తంగా అర్హుల్లో 98 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా, 92 శాతం రెండు డోసులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ పంపిణీకి 2022- 23 బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం మూడో డోసు పంపిణీ చేస్తున్నప్పటికీ కరోనా ప్రాబల్యం తగ్గడంతో టీకా తీసుకునేందుకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో సేకరించిన టీకాల వినియోగ గడువుతో అవి వృధా అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వాటి కోసం కేటాయించిన బడ్జెట్లో రూ. 4237 కోట్లను ఆర్థిక శాఖకు అప్పగించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒక విధంగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు