భద్రాద్రి రాముడి స్థలంపై క్రైస్తవ (వైయస్సార్సీ) మాఫియా!

తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది. వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు.  దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ (వైయస్సార్ కాంగ్రెస్) ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారని  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆరోపించారు.
 
రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ, భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారని, అనుమతి లేకుండా అక్రమంగా  ఇళ్లు   నిర్మిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగే వారు ఎవరూ లేకపోవడం,  ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.
“శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు? అడగడానికి” అంటూ రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు.
అసలు విషయం ఏమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. అయితే 2014లో రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయి. రాముల వారి మందిరం మాత్రం ఖమ్మం జిల్లాలోని మిగిలింది. కానీ భూములు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాయి.
తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని జిల్లాలను విభజిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలం, ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాను పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాగా విడదీశారు.
 ప్రస్తుతం భద్రాద్రి శ్రీ రాములవారి భూములు ఉన్న ప్రాంతం ఎటపాక మండలం, పురుషోత్తమ పట్టణం గ్రామాలు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. కాబట్టి ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయని బాలస్వామి తెలిపారు.
 
తన కార్ డ్రైవర్ ను చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అండదండలతో వైఎస్ఆర్సిపికి చెందిన ఎటపాక ఎంపీటీసీ రామిరెడ్డి రాముడి భూములు కబ్జా చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అతను హిందుత్వాన్ని వీడి క్రైస్తవ మతం ఆచరిస్తున్నాడని, దేవుడి భూములలో ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, ఇతరులను కూడా నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు.
దేవుడి భూములలో నిర్మాణాలను ఆపాలని అధికారులు వెళితే  “రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడిననే వచ్చి అడగమను. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు” అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాలస్వామి విస్మయం వ్యక్తం చేశారు.
 పైగా, రాముడి పేరుతో ఎగతాళి చేస్తూ వెకిలీ చేష్టలు చేస్తున్నాని చెబుతూ ఇదంతా అక్కడి పాలకుల సహాయ సహకారలతోనే జరుగుతున్నదని స్పష్టంగా చెప్పవచ్చని తెలిపారు.  దేశానికి స్వాతంత్రం రాకముందు 1867లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్లు రికార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు.
సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు కూడా కబ్జాదారులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు.
పట్టపగలే భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆస్తులను దోచుకుంటున్న దొంగలను హిందూ సమాజం నిలదీయాలని బాలస్వామి పిలుపిచ్చారు. రాముల వారి ఆస్తులను పరిరక్షించేందుకు ధైర్యంగా నడుము కట్టి నడవాలని విశ్వహిందూ పరిషత్ నేత విజ్ఞప్తి చేశారు. హిందువులంతా చైతన్యమైతే కబ్జాకోరులు, దోపిడి దొంగలు తోకముడవక తప్పదని హెచ్చరించారు. అవసరమనుకుంటే ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.