సాయిబాబా విడుదల ఉత్తరువుపై సుప్రీంకోర్టు స్టే  

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్ సాయిబాబా విడుదలపై  ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్‌ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

ఇవాళ ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తుల విడుదలను సుప్రీం నిలిపివేసింది. హైకోర్టు తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు లో వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. 

యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదని గుర్తు చేశారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు కోర్టు తిరస్కరించిందని చెప్పారు. 

డిసెంబర్‌ 8వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. జస్టిస్‌ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. మావోలతో లింకున్న కేసులో సాయిబాబా నిర్దోషి అని నాగపూర్‌ బెంచ్‌ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును క్రిమినల్‌ ప్రొసిజర్‌లోని 390 కోడ్‌ ప్రకారం వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీం బెంచ్‌ తెలిపింది.

మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. 

దీనిని హైకోర్టులో సాయిబాబా సవాల్‌ చేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ రోహిత్‌ దేవ్‌, జస్టిస్‌ అనిల్‌ పన్సారేతో కూడిన నాగపూర్‌ బెంచ్‌, జీవిత ఖైదు శిక్షను రద్దుచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది.