మసీదులో ప్రార్ధనలు చేస్తుండగా పాక్‌ లో మాజీ జడ్జి కాల్చివేత

మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఫెడరల్‌ షరియత్‌ కోర్టు మాజీ జస్టిస్‌, బలోచిస్తాన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌ను హత్య చేశారు. ఖారన్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా మహమ్మద్‌ నూర్‌ మెస్‌కంజాయ్‌పై అటాక్‌ జరిగింది. 

మసీదు బయట నుంచి కాల్పులు జరిగిన సమయంలో జస్టిస్‌ నూర్‌ సోదరుడు హజీ ముంతాజ్‌ అహ్మద్‌ కూడా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించుకున్నది. 66 ఏళ్ల మెస్‌కంజాయ్‌ మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు దాడి జరిగినట్లు ఖరాన్‌ జిల్లా పోలీసు ఆఫీసర్‌ అసీమ్‌ హలీమ్‌ తెలిపారు.

మెస్‌కంజాయ్‌ కడుపులో నాలుగు బుల్లెట్లు దిగాయి. కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జస్టిస్‌ మెస్‌కంజాయ్‌ రెగ్యులర్‌గా ప్రార్థనలు చేసే మసీదులోనే ఆయన ప్రార్థనలు చేశారని, కానీ దురదృష్టవశాత్తు మసీదు కిటికీ నుంచి ఆయన్ను కాల్చివేశారని పోలీసు ఆఫీసర్‌ తెలిపారు.

మే 2019 నుంచి మే 2022 వరకు మెస్‌కంజాయ్‌ ఫెడరల్ షరియల్‌ కోర్టుకు 17వ చీఫ్‌ జస్టిస్‌గా చేశారు. రిబా ఆధారిత బ్యాంకింగ్‌ వ్యవస్థ షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన తీర్పునిచ్చారు.