గత ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన అభివృద్ధి అగాధాన్ని పూడ్చటమేగాక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు తాము బలమైన పునాది వేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపనతోపాటు ఉనా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఐఐఐటీ)ని జాతికి అంకితం చేశారు.
తర్వాత, చంబా లో రెండు జల విద్యుత్తు పథకాలు రెండిటి కి ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై) – III ను ప్రారంభించారు. అంతకుముందు ఉనాలోని అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే కొత్త ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో అనుసంధానం, విద్యా రంగాలను మెరుగుపరచడమే హిమాచల్లో తన పర్యటన ప్రధాన లక్ష్యమని వివరించారు. “బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు ఎంపిక చేసిన మూడు రాష్ట్రాల్లో హిమాచల్ ఒకటిగా నిర్ణయించడం విశేషం. ఈ రాష్ట్రంపై మా ప్రేమకు, అంకితభావానికి ఇది నిదర్శనం” అని ప్రధాని చెప్పారు.
అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి ‘వందే భారత్’ రైలును ప్రవేశపెట్టాలనే నిర్ణయం కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుపుతుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి చెందిన పూర్వతరాలు కనీసం రైలును కూడా చూడలేదని, అలాంటి ఇవాళ ఇక్కడినుంచి అత్యంత అధునాతన రైళ్లు నడుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
ఈ మేరకు డబల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజల ప్రగతికి కృషిచేస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ పౌరుల అవసరాలు, ఆకాంక్షలను మునుపటి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రధాని ధ్వజమెత్తారు.
“నవ భారతం నేడు గత సవాళ్లను అధిగమించి వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. గత శతాబ్దంలోనే ప్రజలకు అందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు ఇవాళగానీ అందుబాటులోకి రాలేదు. ఇకపై 20వ శతాబ్దపు సదుపాయాలను మీకు చేరువచేసి, హిమాచల్ ప్రదేశ్ను 21వ శతాబ్దంతో అనుసంధానిస్తాం” అని ప్రధాని ప్రకటించారు.
గ్రామీణ రహదారులను రెట్టింపు వేగంతో నిర్మిస్తున్నామని, గ్రామ పంచాయతీలను బ్రాడ్బ్యాండ్తో సంధానిస్తున్నామని చెప్పారు. “మా ప్రభుత్వం ఇప్పుడు 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను నెరవేరుస్తోంది” అని పేర్కొన్నారు. ఔషధ తయారీలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడంలో హిమాచల్ ప్రదేశ్ కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు రాష్ట్రానికి అవకాశాలు మరింత పెరగబోతున్నాయని ప్రధాని తెలిపారు.
“హిమాచల్ ప్రదేశ్ సామర్థ్యంకన్నా దాని పార్లమెంటరీ స్థానాల సంఖ్యకే లోగడ విలువ ఎక్కువగా ఉండేది. రాష్ట్రంలో విద్యా సంస్థల కోసం చాలా కాలం నుంచి మూలపడి ఉన్న డిమాండ్ అత్యవసరంగా పరిష్కరించబడింది. ఆ మేరకు ఐఐటీ, ఐఐఐటీ, ఏఐఐఎంఎస్ వంటి విద్యాసంస్థల ఏర్పాటు కోసం డబల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రం ఎదురుచూడాల్సి వచ్చింది” అని ఆయన గుర్తు చేశారు.
గ్యాస్ కనెక్శన్ లు, తాగునీటి ని నల్లా ద్వారా సరఫరా చేయడం, ఆరోగ్య సేవ లు, ఆయుష్మాన్ భారత్, ఇంకా రహదారి సంధానం సమకూర్చడం వంటి చర్యల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాలు సుదూర ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ప్రజా జీవనంలో పెను మాపృకు తీసుకువస్తున్నాయని ప్రధాని చెప్పారు.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సురేష్ కశ్యప్ తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!