పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వేకు కేంద్రం ఆమోదం 

గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ముంపుపై సంయుక్త సర్వేకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం గత నెల భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించిన టెక్నికల్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించింది.

కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ ఆర్.కె.గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. 

గోదావరి నది పరీవాహకంగా భారీ వర్షాలు, ఇటీవల గోదావరి నదికి వచ్చిన భారీ వరదలు, పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా వరద నీటి విడుదల సామర్థ్ధం, పోలవరం ప్రాజెక్టుకు ఎగువన బ్యాక్ వాటర్ ప్రభావం, గోదావరి నదికి ఇరువైపులా వరద ముంపు విస్తరణ పాంత్రాలు, ముంపును తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో గోదావరి నది పరీవాహకంగా రాష్ట్రంలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 150 గ్రామాలపైన వరద ముంపు ప్రభావం పడిందని  తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్‌సి మురళీధర్ తెలిపారు. ఇటీవల వరదలకు 28 వేలకు పైగా ఆవాసాలపై బ్యాక్ వాటర్ ప్రభావం పడిందని, 11వేల కుటుంబాలు నష్టపోయాయని, అంతేకాకుండా 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కూడా పోలవరం బ్యాక్ వాటర్‌లో మునిగినట్టు వివరించారు.

తెలంగాణ రాష్ట్రం వెలిబుచ్చిన అభిప్రాయాలకు చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు కుడా శృతి కలిపి మద్దతు తెలిపాయి. మూడు రాష్ట్రాలు ఇదే అంశానిు ప్రస్తావించడంతో ఉమ్మడి సర్వే మరోసారి నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. దీంతో కేంద్ర జల వనరుల సంఘం పోలవరం ముంపు ప్రభావంపై సంయుక్త సర్వేకు సుముఖత తెలిపింది.

గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ అవార్డు అనంతరం గోదావరి నది పరీవాహకంగా చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, తక్కువ కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, గోదావరి నదిలో వరద ఉధృతికి నదికి ఇరువైపులా పెరుగుతున్న మునక ప్రాంతాలు, పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకూ విస్తరించే కాంటూర్ లెవల్స్ , బ్యాక్ వాటర్ పోటు వల్ల గోదావరి ఉప నదులు పొంగి ఇరువైపులా జరిగే ముంపు నష్టాలు తదితర అంశాలన్నింటిపైనా సమగ్ర అధ్యయనం జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లకు కేంద్రం సుముఖత తెలిపింది.

పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వరద ముంపు ఇదివరకటి కంటే పెరుగుతుందన్న ప్రాథమిక అంచనాలను అంగీకరించింది. అధునాతన సాంకేతిక పరికరాల ద్వారా సమగ్ర అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను సిడబ్ల్యూసి కూడా గుర్తించింది. ఈ నెల 9నాటికి అధ్యయానికి అవసరమైన ఇతర సమాచారాన్ని కూడా అందజేయాలని తెలంగాణతో పాటు ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ అధికారులు మాట్లాడుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సిడబ్ల్యుసి ఇచ్చిన పోలవరం డిజైన్‌, వాటర్‌ నీటి విడుదల వంటి వాటిల్లో మార్పులు చేయలేదని పేర్కొంది. తాము ఎలాంటి సర్వేలకైనా సిద్ధమేనని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో అనిు రక్షణ చర్యలు చేపట్టేందుకు సహకరిస్తామని తెలిపారు.