పోలవరం పర్యావరణంపై `సుప్రీం’లో జగన్ కు చుక్కెదురు

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైంది పర్యావరణానికి కలిగిన నష్టానికి ఎందుకు బాధ్యత తీసుకోరని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. న్యాయవాదులకు ఫీజులు చెల్లించడానికి డబ్బు వెచ్చిస్తున్న ప్రభుత్వం పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని నిలదీసింది.
 
పోలవరం ప్రాజెక్ట్ కేసులో ఇప్పటి వరకూ ఎంత డబ్బు న్యాయవాదులకు ఖర్చు పెట్టారనే దానిపై నోటీసు ఇస్తామని సుప్రీం పేర్కొంది.   ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేస్తారని సుప్రీం ప్రశ్నించింది. ప్రభుత్వాలకు న్యాయవాదులను రంగంలో దించడంపై ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణ పైన లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లాంఘనలకు రూ.120 కోట్లు పర్యావరణ రుసుము చెల్లించాలన్న ఎన్జీటీ తీర్పు ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ అజయ్ రాస్తోగి బెంచ్ కేసు విచారణ జరిపింది.  పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అప్పీళ్ళను కలిపి వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
 
ఇప్పటికీ ఇంకా ఉల్లాంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ డాక్టర్ పెంటపాటి పుల్లారవు తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు వివరించారు. ప్రాజెక్టు వల్ల యాభై వేల మంది ముంపునకు గురయ్యారని పుల్లారావు తరఫు న్యాయవాది వివరించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన మూడు అప్పీళ్ళను విచారించేందుకు సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది.