ఇటలీ ప్రధానిగా తొలి మహిళా జార్జియా మెలోని

ఇటలీ ప్రధాని పీఠాన్ని తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళ ప్రధాని కావడం ఇదే మొదటిసారి.
 
ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీయే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఇటలీలో రాజకీయ సుస్థిరతకు తాజా ఎన్నికలు వీలు కల్పించాయి. ఆమె నేతృత్వం లోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది.
 
‘గాడ్, ఫాదర్‌ల్యాండ్ అండ్ ఫ్యామిలీ ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశం లోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు.
 
గత ఎన్నికల్లో మెలోని పార్టీకి కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు లభించాయి. కానీ , మారియో డ్రాఘీ నేతృత్వం లోని కూటమిలో చేరడానికి నిరాకరించారు. దీంతో ఆమె ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలిచారు. అయితే, కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత ఇంధన ధరల మంటను ఇటలీ ఎక్కువగా చవిచూస్తోంది. ఐరోపాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటిని ఆమె సరిదిద్దాల్సి ఉంది.
 
‘‘మనం ఆరంభ స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది’’ అని 45 ఏళ్ల జార్జియా మెలోనీ తన పార్టీ మద్దతుదారులతో పేర్కొన్నారు. గ్రాబ్టెల్లా లోని ఓ కార్మిక కుటుంబంలో మెలోని జన్మించారు.  చిన్నతనంలోనే తండ్రి వారి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో మెలోని తల్లి వద్దే పెరిగింది. యుక్త వయసులో ఆమె నియో ఫాసిస్టు సంస్థ యూత్ విభాగంలో చేరారు. కాకపోతే తాను ఫాసిస్టుని కాదని ఆమె చెబుతారు.