వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్‌ను పిస్తోల్‌తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది ముక్తార్ అన్సారీ అప్పగింతకు సంబంధించి పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

2003 లో ఖైదీగా ఉన్న ముక్తార్ అన్సారీని కలిసేందుకు వచ్చేవారిని తనిఖీలు చేయాలని నాటి జిల్లా జైల్ లోని జైలర్ ఎస్‌కే అవస్థి ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన అన్సారీ అతడిని పిస్తోలుతో బెదిరించారు. ఈ ఘటనపై ఆలంబాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కింది కోర్టులో అన్సారీ నిర్దోషిగా బయటకు రాగా, ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష పడింది. అన్సారీకి సంబంధించి డజనుకు పైగా కేసుల్లో విచారణ జరుగుతోంది. అతడిపై యూపీ లోనే 52 కేసులు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని మావు నియోజకవర్గం నుంచి గతంలో అన్సారీ ఐదు సార్లు ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆయనపై ఘజియాబాద్ జిల్లాలోనే దాదాపు 38కి పైగా కేసులు నమోదయ్యాయి. అన్నీ తీవ్రమైన నేరాలకు సంబంధించినవే. 2005 లో జరిగిన బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్ హత్య కేసు లోని ప్రధాన నిందితుల్లో ముక్తార్ ఒకడు.
 
2009లో జరిగిన ఓ జంట హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. 2019లో జైలు నుంచి ఫోన్ చేసి పంజాబ్ లోని ఓ వ్యాపారవేత్తను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పంజాబ్ పోలీసులు వారెంట్‌పై అన్సారీని తీసుకెళ్లారు. తిరిగి అతడిని యూపీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. చివరికి న్యాయస్థానం తీర్పుతో అన్సారీని యూపీకి తరలించారు.