రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీజేపీ నేటి నుంచి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది.బీజేపీ పోరు బాట యాత్రను ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ యాత్రను ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కేంద్రం సాయంతో ఎలా రాష్ట్రాభివృద్ధికి పాల్పడుతున్నది వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది.
విజయవాడలోని సత్యనారాయణపురం శివాజీ కెఫె సెంటర్లో స్ట్రీట్ మీటింగ్తో యాత్ర మొదలైంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బస్సు, ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు పేరుతో సభలు, జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు బీజేపీ నేతలు వివరించనున్నారు.
ఇవాల్టి నుంచి ప్రారంభమైన పోరు బాట యాత్ర తొలి దశ అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగనున్నది. దాదాపు 15 రోజులపాటు బీజేపీ ముఖ్య నాయకులంతా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. 175 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 వేల బహిరంగ సభలు నిర్వహించనున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాదాపు 5 వేల బహిరంగసభలు నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతున్నది.
ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ యాత్ర లక్ష్యమని బీజేపీ నేతలు చెప్తున్నారు. కుటుంబ పార్టీ రాజకీయాల కారణంగా రాష్ట్రం నష్టపోతున్న విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు వారు తెలిపారు.
కాగా, అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. నిర్వాసితులకు సంబంధించిన లెక్కలు కేంద్రానికి ఇవ్వలేదని అంటూ రాష్ట్ర ప్రభుత్వ తప్పులు చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. సీఎం అయ్యాక జగన్ ప్రజల్లోకి రావడమే మానేశారని మండిపడ్డారు.
ఒక్కో జిల్లాలో 50 పోరు యాత్ర సభలు నిర్వహిస్తామని వీర్రాజు తెలిపారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఏపీలో బంగారం అయినా దొరుకుతుంది కానీ.. ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు. జగన్కు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా… ధర పెంచేశారని ఆరోపించారు.
సొమ్ము కేంద్రానిది… సోకు జగన్ ది అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ రాజధాని కట్టకపోవడం వల్లే రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చిందని తెలిపారు. టీడీపీ, వైసీపీని దూరంగా పెడితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.
More Stories
మోదీ పథకాలకు స్టిక్కర్ లతో జగన్ మోసం
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
విశాఖ స్టీల్ మూతపడే దుస్థితి శోచనీయం