విద్యుత్ సంస్కరణలు సబ్సిడీలు, ఉచితాలకు అడ్డు కాదు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణలతో సబ్సిడీలకు, ఉచిత విద్యుత్ లకు కాలం చెల్లుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న ఆరోపణలను  కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు మేలు చేయడం కోసమే విద్యుత్ సంస్కరణలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లులో పొందుపర్చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కల్పిస్తాయని భరోసా ఇచ్చారు.  ఈ బిల్లు ద్వారా విద్యుత్ రంగంలో పోటీ తత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు.

పోటీతత్వం ద్వారా మార్కెట్లో మోనోపోలీ (గుత్తాధిపత్యం) పోతుందని చెబుతూ గుత్తాధిపత్యం ఎన్నటికీ ప్రజలకు వ్యతిరేకమే అన్న సంగతి మర్చిపోవద్దని హితవు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గుత్తాధిపత్యాన్నే కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  విద్యుత్ బిల్లు, సంస్కరణలపై తాను గతంలోనూ వివరణ ఇచ్చానని గుర్తుచేశారు. తక్కువ ధరకు విద్యుత్ సేవలు అందించడమే బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు, ఉచితాలకు ఈ బిల్లు ఏరకంగానూ అడ్డు కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మాత్రమే కాదు, సమాజంలోని ఏ వర్గం వారికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చినట్టుగా ఉచిత విద్యుత్ ఇచ్చుకోవచ్చని ఆయన తేల్చి చెప్పారు. ఈ సబ్సిడీలు, ఉచితాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, అభ్యంతరం అసలే లేదని భరోసా ఇచ్చారు.

తాము కేవలం మార్కెట్లో పోటీతత్వాన్ని తీసుకొస్తున్నామని, తద్వారా ప్రజలు గుత్తాధిపత్యం ప్రదర్శించే ఒక కంపెనీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు. ఇకపోతే చట్టాలు చేయడం, వెనక్కి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యవసాయ శాఖ తన పరిధిలోనిది కాదని, విద్యుత్ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు.