నిజాం పాలన నుంచి సెప్టెంబర్ 17 నిజమైన విమోచన దినం

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 నిజమైన విమోచన దినం అని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలని యువతకు పిలుపిచ్చారు.
 
హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభిస్తూ పరకాల, బైరంపల్లి ఘటనలను గుర్తు చేశారు. పరకాల ఊచకోతలో 30 మందిని కాల్చి చంపారని, బైరంపల్లి లో రజాకార్లు 90 మందికి పైగా అమాయకులను బావిలోకి తోసి వేశారని గవర్నర్ వివరించారు.
 
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుంది.  హైదరాబాద్ విమోచన వారోత్సవాలను సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అధికారికంగా ఏడాది పాటు 2023 సెప్టెంబర్ 17 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తో కలిసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసాయి.
 
 హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ఉక్కు మనిషిగా గుర్తింపు పొందిన అప్పటి హోంమంత్రి సర్దార్ హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆపరేషన్ పోలో కార్యక్రమాన్ని చేపట్టారని గవర్నర్ తెలిపారు.  ఈ నెల 17న హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) డైరెక్టర్ జనరల్ (సౌత్) ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో స్వాతంత్ర సమరయోధులు పోషించిన పాత్ర గుర్తుకు తెచ్చేలా ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.
 కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాన్ని వివరిస్తూ మొత్తం 60 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు.

అంతకుముందు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రమణారెడ్డిని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను గవర్నర్ సన్మానించారు. సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉమా నండూరి మాట్లాడారు. వేదిక వద్ద పబ్లికేషన్స్ విభాగం ఒక పుస్తక ప్రదర్శన, లలిత కళా అకాడమీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని చిత్రించే పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.