బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శనివారం కూడా కొనసాగాయి. వీటి ప్రభావంతో అనేక చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇక్కట్ల పాలయ్యారు. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ,19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండగా, చాలా వరకు కోతకు గురయ్యాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత మూడు రోజులుగా అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతుండగానే దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉందని నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడే ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి రాజంపేట మండలం లింగాయపల్లిలో మండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజంపేట నుంచి కామారెడ్డికి రాకపోకలకు నిలిచిపోయాయి.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి
తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ