నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం

నూకల ఎగుమతిపై కేంద్ర నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతిస్తారని తెలిపింది.

 గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అటు వరి ధాన్యం, బ్రౌన్ రైస్, సెమీ మిల్డ్ రైస్‌పై భారత్ 20 శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ సుంకం అమల్లోకి రానుంది. 

ఇక 2021–22లో భారత్ 21 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది బియ్యం ఎగుమతులు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గత సీజన్ కంటే 6 శాతం తక్కువగా నమోదైంది. మొత్తంగా రైతులు 383.99 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిని సాగు చేస్తున్నారు.

వరి పంట ఎక్కువగా పండే ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే 70 శాతం మాత్రమే వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు వరి పంటను తక్కువగా సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడం వల్ల ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశాలున్నాయన్న ఆందళనతో కేంద్ర…నూకల ఎగుమతిపై నిషేధం విధించింది.

మరోవైపు ఈ ఏడాది మే లో కేంద్ర గోధుమల ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. రష్యా ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుండటంతో ఆహార భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే పొరుగు దేశాల అవసరాలను తీర్చడం కోసం కూడా గోధుమల ఎగుమతిపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. గోధుమలతో పాటు గోధుమ పిండి, మైదా, రవ్వ, హోల్ మీల్ ఆటా వంటి ఇతర గోధుమ సంబంధిత ఉత్పత్పులపై కూడా ఆంక్షలు విధించింది.