గుండెపోటుతో కర్ణాటక మంత్రి ఉమేష్ కట్టి మృతి

కర్ణాటక అటవీ, ఆహార, పౌరసరఫరాల శాఖ  కేబినెట్ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కట్టి గుండెపోటుతో మంగళవారం రాత్రి మరణించారు. బెల్గావి జిల్లాకు చెందిన ఉమేష్ విశ్వనాథ్ మంగళవారం రాత్రి బాత్‌రూంలో కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అప్పటికే మంత్రి మరణించారని కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి అశోక చెప్పారు. ఉమేష్ విశ్వనాథ్ ఆకస్మిక మృతి బీజేపీకి తీరని లోటని మంత్రి అశోక వ్యాఖ్యానించారు. ఉమేష్ విశ్వనాథ్ సేవాభావం,సమర్థత, అంకితభావం ఉన్న మంత్రి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. 
 
అనంతరం మంత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉమేష్ తనకు తమ్ముడులాంటివాడని, ఆయనకు కొన్ని గుండె సంబంధిత రోగాలున్నట్లు తెలుసని, అయితే ఇంత త్వరగా తమను విధించి వెడతారని అనుకోలేదని ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో సమర్ధవంతంగా ఎన్నో శాఖలను నిర్వహించిన ఆయన మరణం రాష్ట్రానికి ఎంతో  లోటని, తమకు పెద్ద సూన్యతను మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
61 ఏళ్ల ఉమేష్ రెండు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మంత్రి మృతి వార్త తెలిసిన వెంటనే మంత్రులు గోవింద్ కార్జోల్, సుధాకర్, బీజేపీ నేతలు ఆసుపత్రికి వచ్చి తమ సంతాపం తెలిపారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య కూడా మంత్రి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 
 
ఉమేష్ 8 సార్లు బెల్గావి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెల్గావి జిల్లాలో మంత్రి మృతికి సంతాప సూచకంగా బుధవారం స్కూళ్లు, కళాశాలలను మూసివేశారు.