గ్రామ గ్రామానికి వెళ్లండి… ప్రజలకు భరోసా కల్పించండి

‘‘ గ్రామ గ్రామానికి వెళ్లండి… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించండి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించండి. ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించండి. ప్రజా గోస – బీజేపీ భరోసా ప్రధాన లక్ష్యమిదే..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
 
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా’’ తొలి దశ కార్యక్రమం అమలు తీరు తెన్నులను సమీక్షించి, రెండో దశ బైక్ ర్యాలీల కార్యక్రమాల నిర్వహణపై కార్యాచరణపై చర్చించారు.
 
 మొదటి దశ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభించి 605 గ్రామాల్లో పర్యటించారు. దాదాపు 2 వేల కి.మీల మేర బైక్ ర్యాలీలు నిర్వహించిన పార్టీ నాయకులు రైతులు, మహిళలు, కార్మికులు, కూలీలు సహా వివిధ వర్గాలకు సంబంధించి లక్షలాది మంది ప్రజలతో మమేకమయ్యారు.
 రెండో దశ కార్యక్రమాన్ని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు.  రెండో దశలో భాగంగా బైక్ ర్యాలీలు నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సంజయ్ ఆదేశించారు.  ఈ బైక్ ర్యాలీల్లో సంబంధిత జిల్లా, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా నేతలను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్లను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని సూచించారు.
 
 తరుణ్ చుగ్ మాట్లాడుతూ ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీల్లో భాగంగా స్థానిక దేవాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. స్థానికంగా పార్టీ కోసం నిరంతరం పాటుపడే సామాన్య కార్యకర్తల ఇంట్లో తప్పనిసరిగా రాత్రి బస చేయాలని కోరారు. 
 
మరోవైపు రెండో దశ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, ఖానాపూర్, భూపాలపల్లి, వైరా, సూర్యాపేట, మహబూబాబాద్, బాల్కొండ, కామారెడ్డి, మంచిర్యాల, వికారాబాద్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.