విద్యా వ్యవస్థను పటిష్టం చేయటంలో జాతీయ విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని తెలుపుతూ దీనిని ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు విద్యా భారతి కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ సూచించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ విద్యాలయాలు నడుపుతున్న స్వచ్ఛంద విద్యా వ్యవస్థల సమూహంగా పేరొందిన విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర (ఏపీ, తెలంగాణ, కర్నాటక) రెండు రోజుల క్షేత్రీయ సమావేశాలు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జరిగాయి.
కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని, తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశాలలో ప్రసంగిస్తూ రామకృష్ణ చెప్పారు. ఈ దిశగా విద్యారంగంలో కృషి జరగాలని ఆయన తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యా భారతి పాఠశాలల్లో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను ఈ సమావేశాలలో సమీక్షించారు.
శ్రీ సరస్వతీ శిశుమందిరాల ప్రభావం సమాజంపై గాఢంగా పడిందని దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు తెలిపారు. విద్యా భారతి కార్యకర్తలు సంఘటితంగా వుంటూ అనుకున్న ,లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కేవలం వాచక జ్ఞానం వుంటే సరిపోదని, దానిని అనుభవైక జ్ఞానంగా మలుచుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం సహా అనేక అంశాలపై విద్యా భారతి నుంచి అనేక పుస్తకాలు, సాహిత్యం విడుదల అవుతున్నాయి. తాజాగా బాలికల విద్య పట్ల అవగాహన కల్పించేందుకు “బాలిక విద్య” అనే పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించారు.
రెండు రోజుల కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి అయాచితుల లక్ష్మణ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అనంతపురం సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మూడు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో రెండు బ్యారేజీలు!
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ!