రోహింగ్యా సమస్య పరిష్కారంకై భారత్ వైపు చూస్తున్న షైక్ హసీనా 

రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని చెబుతూ ఈ సమస్య విషయమై భారత్ మాత్రమే పరిష్కారం చూపగలదని  బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు. వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.

హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు హసీనా చెప్పారు.

‘రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు’ అని ఆమె చెప్పారు. “మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో  చర్చలు జరుపుతున్నాం. వారిని తిరిగి పంపించేందుకు వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మానవీయ కోణంలోనే వారికి ఆశ్రయం కల్పించాం” అని హసీనా తెలిపారు.

కరోనా సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించామని చెబుతూ  కానీ, వారు ఏన్నాళ్లుంటారు? అని ఆమె ప్రశ్నించారు.  అందుకే వారిని క్యాంపులో ఉంచామని, అయితే  అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె చెప్పారు.  కొందరు మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే తమకు, మయన్మార్‌కు అంత మంచిదని హసీనా స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నామని తెలిపారు. “కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను” అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.

తీస్తా నది జలాల పంపకాల అంశలో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నించగా తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆమె తెలిపారు. భారత ప్రధాని మోదీ  కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని ఆమె తెలిపారు.

భారత్ పై ప్రశంసల జల్లు 

బంగ్లాదేశ్ ప్రజలకు భారత ప్రభుత్వం చేసిన రెండు సహాయాలు ప్రత్యేకంగా ప్రశంసించదగినవని హసీనా తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోనూ, దాని పొరుగు దేశమైన పోలండ్‌లోనూ భారతీయ విద్యార్థుల మాదిరిగానే తమ దేశ విద్యార్థులు కూడా చిక్కుకుపోయారని చెబుతూ  ఆ విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో భారత దేశం చేసిన సహాయానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇది నిజమైన స్నేహపూర్వక చర్య అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్తున్నానని ఆమె తెలిపారు. అదేవిధంగా, వ్యాక్సిన్ మైత్రి పథకంలో భాగంగా బంగ్లాదేశ్‌కు మాత్రమే కాకుండా కొన్ని దక్షిణాసియా దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్లను పంపించారని గుర్తు చేస్తూ ఆమె మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఈ వ్యాక్సిన్లు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.

ఇది మోదీ దార్శనికతతో చేపట్టిన  చర్య అని హసీనా కొనియాడారు. అంతేకాకుండా తాము తమ సొంత నిధులతో టీకాలను కొన్నామని, మరికొన్ని దేశాలు కూడా తమకు టీకాలను అందజేశాయని ఆమె వివరించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య స్నేహం కాల పరీక్షకు నిలిచిందని ఆమె ఆమె స్పష్టం చేశారు.

అవసరమైన ప్రతిసారీ బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచిందని చెబుతూ మొదట 1971లో జరిగిన యుద్ధంలో, ఆ తర్వాత ఇతర సందర్భాల్లో తమకు భారత్ మద్దతుగా ఉంటోందని హసీనా గుర్తు చేసుకున్నారు.  ఇరు దేశాల మధ్య  కొన్ని విభేదాలు ఉండవచ్చునని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అనేక అంశాల్లో భారత్, బంగ్లాదేశ్ ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ఆమె తెలిపారు.