మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఈ ఘటన జూలై 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్లోని తల్వాండి సాబో నియోజవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్కు ఆమె భర్తకు మధ్య తన నివాసంలో ఏదో విషయమై గొడవ చోటుచేసుకుంది. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు దూరంగా తీసుకొచ్చారు.
ఈ క్రమంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్లీ వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆవేశానికి లోనైన భర్త అందరి ముందే ఆమెపై దాడికి దిగాడు. ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే పక్కన ఉన్నవారు ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పంజాయ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లోనే ఇలా వేధింపులకు గురికావడం బాధాకరమని మండిపడుతున్నారు. ఇక ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ గానీ ఆమె భర్త గానీ స్పందించలేదు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటో తెలియదని, ఈ వీడియోను ఎవరూ లీక్ చేశారో తెలియదని తెలిపారు. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు.
ఇదిలా ఉండగా పంజాబ్లోని మఝూ ప్రాంతంలో ఆప్ యూత్ విభాగ కన్వీనర్ అయిన సుఖ్రాజ్తో 2019లో బల్జిందర్కు వివాహం జరిగింది. పంజాయ్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేసిన బల్జిందర్ కౌర్ రెండుసార్లు ఆప్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఫతేఘర్ సాహిబ్లోని మతా గుజ్రీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు