సైబర్‌ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానం

సాంకేతికతను వినియోగించుకోవడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని చెప్పుకొనే తెలంగాణ సైబర్ నేరాలలో సహితం అగ్రగామిగా ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి నేరం జరిగినా పసిగట్టగలిగే విధంగా అత్యాధునిగా పోలీస్ టవర్స్ ను నిర్మించుకున్నారు. 
దేశంలో మరెక్కడా లేనన్ని సిసి కెమెరాలను అమర్చుకున్నారు. కానీ నేరాలను అదుపు చేయడంలో మాత్రం తెలంగాణ పోలీసులు చేతులెత్తేస్తున్నారా? అనే అనుమానాలు  కలుగుతున్నాయి. 
2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్‌ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది.

దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2019లో 2,691 సైబర్‌ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్‌ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి.

దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్‌ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్‌ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో  ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి.

23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్‌ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఓటీపీ, మార్ఫింగ్‌ మోసాలు, ఫేక్‌ ప్రొఫైల్‌ తయారీ తెలంగాణలో అధికమని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తేలింది.