ప్రమాదంలో 34.5 కోట్ల మంది ప్రజల ఆహార భద్రత

ఉక్రెయిన్‌ ఘర్షణల ప్రకంపనలకు అంతర్జాతీయ వ్యవస్థ పునాదులు బలహీనపడుతున్నాయని ఐరాస రాజకీయ, శాంతి నిర్మాణ వ్యవహారాల విభాగం సహాయ కార్యదర్శి రోజ్‌మేరే డి కార్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్‌పి) అంచనా ప్రకారం 82 దేశాల్లో 34.5 కోట్ల మంది ప్రజల ఆహార భద్రత అత్యంత ప్రమాదంలో పడిందని ఆమె చెప్పారు. 

ఉక్రెయిన్‌ సంక్షోభం పర్యవసానంగా 4.7 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితిలోకి నెట్టబడ్డారని ఆమె పేర్కొన్నారు. జులైలో ఐరాస అభివృద్ధి కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) వేసిన అంచనా ప్రకారం ఉక్రెయిన్‌ ఘర్షణ ప్రారంభమైన మూడు మాసాల తరువాత 7.1 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడ్డారు.

 ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ కల్లోలంలోనే కొట్టుమిట్టాడుతోంది, 2022 చివరి భాగం, 2023 మొడటి భాగం వరకు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్దత తొలగే స్థితి కానరావడం లేదు. ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం మొదలు కాబోతుంది, అప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండొచ్చని ఆమె హెచ్చరించారు. 

ఆహార ధరలు ఇటీవల కాలంలో నిలకడగా ఉన్నా ద్రవ్యోల్బణం రేట్లు తగ్గే సూచనలేవీ కానరావడం లేదు. 2022 జులైలోనూ ద్రవ్యోల్బణం పెరగడమే తప్ప తగ్గే దాఖలాలేమీ లేవు. సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణం గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డులు బద్దలు కొడుతున్నాయి. 

చాలా వర్ధమాన దేశాల్లో ఆర్థిక పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అప్పులు, దిగుమతి బిల్లులు పెరిగిపోతుండటంతో ఆర్థిక పరిస్థితి మరింత ఒత్తిడికి గురవుతోంది. వర్థమాన దేశాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడం మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోందని ఐరాస అధికారి తెలిపారు. 

ఇది సామాజిక అశాంతికి దారితీసే అవకాశముందని ఆమె హెచ్చరించారు. 2022 మొదటి, రెండవ త్రైమాసికాల్లో హింసాత్మక ఘటనలు పెరిగిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రపంచ విభజనను మరింత తీవ్రతరం చేస్తోంది. మన సంస్థల పట్ల అప నమ్మకాన్ని పెంచుతోంది. మొత్తంగా ప్రపంచ వ్యవస్థ పునారులనే బలహీన పరుస్తోందని ఆమె చెప్పారు. ఈ యుద్ధం మతిమాలినదే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. ఇది మనంతరి జీవితాలను తాకుతుంది. అందుకే దీనికి స్వస్తి పలకాలని ఆమె కోరారు.