లింగమార్పిడి  వ్యక్తులకు ఆరోగ్య సేవలకై చారిత్రాత్మక ఒప్పందం 

లింగమార్పిడి  వ్యక్తులకు ఆరోగ్య సేవలకై చారిత్రాత్మక ఒప్పందం 
లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు  ( ట్రాన్సజెండర్) ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంఫై బుధవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్, సామాజిక న్యాయం, సాధికారత శాఖలు సంతకాలు చేశాయి.  
 
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, సామాజిక న్యాయం , సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమక్షంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ.ఆర్.సుబ్రహ్మణ్యం ఒప్పందంపై సంతకాలు చేశారు.
 
ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  ఒప్పందం వల్ల లింగమార్పిడి చేసుకున్న వారు  ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు పొందుతారని తెలిపారు. దీనివల్ల లింగమార్పిడి చేసుకున్న వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొంది జీవించగలుగుతారని చెప్పారు. 
 
సమాజంలో పరివర్తన తెచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాలకు ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందం పునాదిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడి ఉన్న ట్రాన్సజెండర్ వర్గానికి ఈ ఒప్పందం వల్ల  సమగ్ర ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.  ట్రాన్సజెండర్లకు సమాజంలో గుర్తింపు, గౌరవం లభించడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కళంకిత ముద్ర పడిన ట్రాన్సజెండర్లను సమాజం వెలి వేసినట్లు చూస్తున్నదని  చెప్పారు. 
 
అన్ని వర్గాలకు  సమానత్వం, గుర్తింపు, గౌరవం లభించే విధంగా నవ సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదని డాక్టర్ మాండవీయ వివరించారు. దీనిలో భాగంగా ట్రాన్సజెండర్లకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే విధంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు.
 
ఇటీవల కాలంలో సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ “లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019”, గరిమా గ్రేహ్, పీఎం  దక్ష్ లాంటి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నదని గుర్తు చేశారు.
 
ఈ ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా లింగమార్పిడి వ్యక్తులకు (ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ పోర్టల్ జారీ చేసిన లింగమార్పిడి ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉన్నవారికి) అన్ని ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుతాయని  డాక్టర్ మాండవ్య చెప్పారు. ఒక ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారునికి సంవత్సరానికి రూ.5 లక్షల బీమా రక్షణను సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ అందిస్తుంది. 
 
ఇప్పటికే  ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆసుపత్రులు అందిస్తున్న నిర్దిష్ట ప్యాకేజీలు, అన్ని ఆరోగ్య సేవలు, సౌకర్యాలు  ట్రాన్స్‌జెండర్లు పొందవచ్చు.    ప్యాకేజీలు మరియు నిర్దిష్ట ప్యాకేజీలు (సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ (ఎస్ఆర్ఎస్) చికిత్స)తో సహా లింగమార్పిడి వర్గం కోసం సమగ్ర ప్యాకేజీ మాస్టర్ సిద్ధం చేస్తుంది.      ఇతర కేంద్రం/రాష్ట్ర ప్రాయోజిత పథకాల నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందని లింగమార్పిడి వ్యక్తులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.