తెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను బాలసాహిత్య పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణ  రాష్ట్రం సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి ఎంపిక చేశారు.
అలాగే ఏపీలోని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పల్లిపట్టు నాగరాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. బాల సాహిత్య పురష్కారానికి న్యాయనిర్ణేతలుగా బెలగం భీమేశ్వరరావు, డాక్టర్ ఎన్. గోపి, చొక్కపు వెంకట్రావు వ్యవహరించారు.
కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ప్రొఫెసర్ హనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి, డాక్టర్ పెన్న శివరాం కృష్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 
పత్తిపాక మోహన్‌
కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్‌  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ పిల్లల కోసం అనేక రచనలు చేశారు.
 పురస్కారానికి ఎంపికైన బాలల తాత బాపూజీతో పాటు.. పిలల కోసం మన కవులు, జో.. అచ్యుతానంద జోజో ముకుంద, ఒక్కేసి.. పువ్వేసి. చందమామ, చందమామ రావే వంటి అనేక రచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను మోహన్‌ తెలుగులోకి అనువదించారు.
పల్లిపట్టు నాగరాజు
చిత్తూరు జిల్లా యాసలో కష్ట జీవులు, బడుగుల బతుకులపై ‘యాలై పూడ్సింది’ శీర్షికతో రచించిన కవితా సంపుటిని కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక చేసింది. 35 ఏళ్ల లోపు సాహిత్య వేత్తలకు కేంద్ర సాహిత్య యువ పురస్కారాలు ప్రకటిస్తారు.
2011లో ప్రారంభించిన ఈ పురస్కారం కింద రూ 50 వేల నగదుతో పాటు జ్ఞాపికలను బహూకరిస్తారు. పల్లిపట్టు నాగరాజు తెలుగు భాష ఉపాధ్యాయుడు. ఆయన ‘యాలై పూడ్సింది’ కవితా సంపుటిని రాసి ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు’ను కూడా అందుకున్నారు.
తెలుగు భాషతో పాటు అస్సామీ, బెంగాలీ, బోడో, దోగ్రి, ఆంగ్లము (ఇంగ్లిష్), గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలి, ఒడియా, రాజస్థానీ, సంస్కృతం, సింధి, తమిళం, ఉర్దూ భాషల్లో ఉత్తమ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా పురస్కారాలు అందిస్తోంది.