హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ. 660 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించారు. 

ఇది 300 పడకల సామర్థ్యంతో  నిర్మించిన దవాఖానాలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, కెమోథెరపీ, ఇమ్యునోథెరపీ,బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయవచ్చు. 

2014కి ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని, గత 8 ఏండ్లలో దేశంలో 200 కంటే కొత్త వైద్య కళాశాలలు నిర్మించామని ప్రధాని తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెబుతూ అందుకే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

ప్రజలు  ఇంకెంతోకాలం కాన్సర్ అంటే భయపడవలసిన అవసరం లేదని ప్రధాని అభయమిచ్చారు. చాలామంది ఈ ప్రాణాంతక వ్యాధిని జయిస్తూ ఉండడం తనకు తెలుసని చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యాన్ని తీసుకు రావడం కోసం వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచడంతో పాటు వైద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని మోదీ వివరించారు. 

అంతకు ముందు 70 ఏళ్లలో చేయలేని కృషిని వైద్య రంగంలో తమ ప్రభుత్వం ఏడెనిమిది ఏళ్లలో చేసినదని ప్రధాని చెబుతూ సమ్మిళిత వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులో తేవడం పట్ల తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 

అంతకుముందు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రిని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. మాతా అమృతానందమయి మఠం ద్వారా నిర్వహిస్తున్నఈ  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2,600 పడకలు ఉన్నాయి. దాదాపు రూ. 6000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఫరీదాబాద్,ఎన్‌సిఆర్ ప్రాంతం మొత్తం ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందిస్తుంది.

ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ద్వారా వైద్య సేవలు అందించడమనేది  పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ మోడల్ కు ఉదాహరణ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా కూడా పాల్గొన్నారు. 

ఈ మోడల్ ద్వారా అట్టడుగు వర్గాల వారికి కూడా సేవలు అందించవచ్చని ప్రధాని చెప్పారు. దేశంలో ప్రస్తుతం విద్య, వైద్య వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెద్ద రోగం వస్తే చికిత్స కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తుండేదని, ఇప్పుడు ఆ అవసరంలేదని ప్రధాని తెలిపారు. ఈ హాస్పిటల్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వచ్చి చికిత్స పొందవచ్చు అని చెప్పారు.