బిజెపిలోకి మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు

మేడ్చల్‌ జిల్లాలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు, ఘట్‌కేసర్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ శనివారం అవుషాపూర్‌లోని ఎంపీపీ నివాసంలో చర్చలు జరిపారు.
వారం రోజుల్లో మండలంలో సమావేశం నిర్వహించి అవుషాపూర్‌ సర్పంచ్‌ కావేరి మశ్చేందర్‌రెడ్డితో పాటు పలువురితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధుల విడుదల చేయాలని అధికార పార్టీ ఎంపీపీగా ఉండి గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
 టీఆర్‌ఎస్‌ పాలనపై పలుమార్లు ఆసంతృప్తిని వ్యక్తం చేసిన, నిధులు కోసం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కలెక్టర్లను కోరినా నిధులు ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని రాజేందర్ విమర్శించారు. కష్టపడి గెలిచిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు కూడా ప్రజల ఓట్లతోనే గెలిచారని పేర్కొంటూ కేసీఆర్‌ పాలనలో ఎమ్మెల్యేలకు తప్ప ఎవరికి అధికారాలు లేవని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు బానిసత్వంలో ఇంకా మగ్గకుండా, గౌరవం కోసం ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందని ఈటెల పిలుపిచ్చారు.  కాంగ్రెస్‌ కరిగిపోతున్న పార్టీ అని యూపీలోనే రాహుల్‌ గాంధీ ఓడిపోయారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల వెంట నడుస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా రూరల్‌ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షుడు హనుమాన్, మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కాగా, గ్రామానికి రూ. కోటి చొప్పున నిధులిస్తే రాజీనామా చేస్తానన్నది వాస్తవమేనైనా, నిధులు ఇవ్వనందున ప్రస్తుతం ఎంపీపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిధుల కోసం మూడేళ్లుగా పోరాటం చేసినా మంత్రులు, అధికారులు స్పందించలేదని విమర్శించారు.  

పాత ప్రొసీడింగ్స్‌తో పనులు చేయిస్తే రాజీనామా చేస్తానన్నది నిజమేనని చెప్పారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కోరినా ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. అందువల్లే ఎంపీపీ పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. 

50 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం!

 ఇలా ఉండగా, రాష్ట్రంలో 50 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశారు. శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగీస్తూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలకు ఇంతవరకు అధికారం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.