కేసీఆర్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యానికి కేరాఫ్ బాస‌ర ట్రిపుల్ ఐటీ

కేసీఆర్ సర్కార్ నిర్ల‌క్ష్యానికి బాస‌ర ట్రిపుల్ ఐటీ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి  దుయ్యబట్టారు.  బాసరలో అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యమే తాండవమాడుతోందని పేర్కొంటూ ఇప్ప‌టికే విద్యార్థులు అనేక ఇబ్బందులు ప‌డుతోంటే… తాజాగా ట్రిపుల్ ఐటీలో కరెంట్ లేక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ‘‘సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యాంపస్లో కరెంట్ లేదు. విద్యుత్ పునరుద్దరణకు మరో రెండు రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు. రాత్రి క్యాండిల్స్ వెలుతురులోనే విద్యార్థులు భోజనం చేశారు. విద్యుత్ లేకపోవడంతో నీటి సరాఫరా కూడా నిలిచిపోయింది. ఇక క్యాంపస్‌లో ఉన్న భారీ సోలార్ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది” అని ఆమె తెలిపారు. 
 
గవర్నర్ తమిళసై పర్యటించిన మరుసటి రోజే క్యాంపస్లో కరెంట్ పోయిందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. వసతుల కల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నరని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ఆమె చెప్పారు. ట్రిపుల్ ఐటీలో ఇదొక్క‌టేకాదు. ఇంకా అనేక స‌మ‌స్య‌లు రాజ్యమేలుతున్నయని,  అయినా కేసీఆర్ స‌ర్కార్ ప‌ట్టించుకున్న పాపాన పోలేదని విజయశాంతి ధ్వజమెత్తారు.
 
 ఇప్ప‌టికైనా ట్రిపుల్ ఐటీలో మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని బీజేపీ త‌రఫున ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కి యావ‌త్ విద్యార్థి లోకం త్వరలోనే త‌గిన స‌మాధానం తప్పక చెబుతుందని ఆమె హెచ్చరించారు.