బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌… కేంద్రం హెచ్చరిక

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా తక్షణమే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించాకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

తనకు కరోనా సోకడంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. బొమ్మై జులై 25, 26న ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన వివిధ శాఖల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆయనకు పాజిటివ్‌గా తేలడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది.

కాగా, టాలీవుడ్‌ నటుడు, హీరో అడివి శేష్ కూడా క‌రోనా బారిన పడ్డాడు. కరోనా  ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న శేష్‌ క‌రోనా నిర్ధ‌ర‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం ఆయనే తన ట్విట్ట‌ర్‌ అకౌంట్‌ ద్వారా తెలియ‌జేశారు.

ఇలా ఉండగా, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా తాజా కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. నిత్యం 19 వేలకు తక్కువ కాకుండా కేసులు ఈ మధ్య  నమోదు అవుతున్నాయి . మరో వేవ్‌ ముప్పు తప్పినట్లేనని, వైరస్‌ ప్రభావం తగ్గిందని, వ్యాక్సినేషన్‌ ప్రభావంతో కరోనా కట్టడి జరుగుతుందని వైద్య నిపుణులు భావించారు ఇంతకాలం. అయితే కొత్త వేరియెంట్‌ ప్రస్తావన లేకుండా కొత్త కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది.

కఠినంగా వ్యవహరించాలని కేంద్రం లేఖలు 

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నందున కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాదు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రేసింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యమంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిలకు లేఖలు రాసింది. అంతేకాదు.. దేశంలో కరోనా జబ్బుతో మరణించేవాళ్ల సంఖ్య సైతం యాభైకి తక్కువ కాకుండా నమోదు అవుతోంది. కాబట్టి, కరోనా ప్రొటోకాల్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య కార్యదర్శి లేఖలో కోరారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో 19,406 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మరణాల సంఖ్య 5,26,649కి చేరింది. పాజిటివిటీ రేటు సైతం ఆందోళనకరంగానే ఉంది. అయితే  అదే సమయంలో.. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 19,928కి పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,35 వేల నుంచి లక్షా 34 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.