తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం

ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలని తమిళనాడు గవర్నర్  ఆర్‌ఎన్‌ రవి  స్పష్టం చేశారు. 2008 నవంబర్‌ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుపడుతూ ఈ విషయమై  అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో  జరిగిన ఆదివారం జరిగిన ఓ సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 11న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందని తెలిపారు. 2008లో, 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు.  కనీసం 174 మంది మరణించగా,  300 మంది గాయపడ్డారు.

ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులంగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ మనకు మిత్రదేశమా? లేక శత్రు దేశమా? ఈ అంశంలో స్పష్టత  ఉండాలని, గందరగోళం ఉండకూడదని ఆయన హితవు చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్‌ రవి వెల్లడించారు.

పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని చేశారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే హెచ్చరిక​ ఇచ్చినట్లు చెప్పారు.

కాగా, మన్మోహన్‌ సింగ్‌ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని గవర్నర్ తెలిపారు. ఆయన స‌మ‌యంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్‌ ఆరోపించారు. అప్పట్లో తీవ్ర‌వాదుల హింస 185 జిల్లాల్లో ఉండేద‌ని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాల‌కు త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందనని చెప్పారు. 

కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ  హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలని హితవు చెప్పారు.  దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని గుర్తు చేశారు. 

ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా,  మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావోయుష్టుల ప్రాంతాల్లోని వారికి ప్ర‌త్యేక ఐడియాల‌జీ ఉంటుందని, వాళ్లు పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్య విధానాన్ని న‌మ్మ‌ర‌ని రవి పేర్కొన్నారు. అయితే తాము దాన్ని అంగీక‌రించ‌బోమ‌ని, ఇక వాళ్ల‌తో చ‌ర్చ‌లు అవ‌స‌రం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ ర‌వి తేల్చి చెప్పారు.