సంజయ్‌ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

వసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని  ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. 
 
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ రౌత్‌ను రూ. 1,034 కోట్ల పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అదుపులోకి తీసుకుంది. 60 ఏళ్ల జర్నలిస్ట్-రాజకీయవేత్త  అయిన ఆయన మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
 
ముంబయిలోని సెంట్రల్ సబర్బన్‌లోని భాండూప్‌లో ఉన్న అతని మైత్రీ బంగ్లాలో దాదాపు డజను మంది ఈడి అధికారులు,  సిబ్బంది సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకునే ముందు తొమ్మిది గంటల పాటు విచారించారు. రౌత్ ను  బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఈడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. 
 
కాగా, రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌  ఆయనను అరెస్టు చేయలేదని చెప్పారు. “రౌత్ సాహెబ్‌ని అరెస్ట్ చేయలేదు, ఇడి ఆఫీసుకి తీసుకెళ్తున్నారు….మేమంతా అక్కడికి వెళ్తున్నాం.. ఏం జరుగుతుందో చూద్దాం” అని పేర్కొన్నారు.  సంజయ్ రౌత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు.