బిజెపి అధికారంలోకి వచ్చాక బలోపేతమైన సైన్యం 

2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాకే భారత సైన్యం  బలోపేతమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. గతంలో  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను దిగుమతి చేసుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు మన దేశమే వాటిని ఎగుమతి చేస్తోందని చెప్పారు. సైన్యంపై స్వేచ్ఛనివ్వడమే మన విధానమని తెలిపారు.
అవసరమైనప్పుడు శత్రువులపై ముందు ఎదురు దాడి చేసి  ఆ తర్వాతే ప్రభుత్వంకు నివేదించామని ఆదేశాలు ఇచ్చారని, ముందుగా అనుమతులు  అవసరం లేదని స్పష్టం చేశారు.  నాయకత్వంలో మార్పు కారణంగా సైనికులు తమ పై అధికారులకు రిపోర్ట్ చేయాల్సి వస్తుందని, కానీ ప్రస్తుతం ఆ అవసరం లేదని పేర్కొన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 23వ కార్గిల్ విజయ్ దివస్ లో జేపీ నడ్డా పాల్గొంటూ కాంగ్రెస్ హయాంలో దేశంలో  రక్షణ ఒప్పందాలన్ని  కుంభకోణాలతో దెబ్బతిన్నాయని ఆరోపించారు.  కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెప్పారు.
బీజేపీ దేశ రక్షణకు కట్టుబడి ఉందన్న ఆయన మోదీ పాలనలో రక్షణ దళాలు ప్రశాంతంగా ఉండొచ్చని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని దేశానికి అందించారని తెలిపారు.  పుల్వామా, ఉరి  దాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్ కు  వారి భాషలోనే సరైన సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో త్రివిధ దళాలు ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నాయని జేపీ నడ్డా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో జవాన్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదని మండిపడ్డారు. అంతేకాకుండా  రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.
కుంభకోణాల వల్ల  ముఖ్యమైన ఒప్పందాలు ఆగిపోయాయని చెప్పారు.  కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం  రక్షణ రంగంలో బలమైన శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. భారత ఎయిర్ ఫోర్స్‌లోని 36 రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ చేరాయని,  28 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లు కూడా చేర్చామని నడ్డా గుర్తు చేశారు.