రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ నమస్కరించ లేదా?

పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్లమెంటు ఆవరణలో ఆదివారం వీడ్కోలు చెబుతున్నప్పటి వీడియోను ఆమ్ ఆద్మీ  పార్టీ నేత సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది.  వీడియోలో రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ నమస్కారం పెట్టలేదని సంజయ్ సింగ్ చేసిన కామెంట్లపై బీజేపీ భగ్గుమంది. 
 
ఇది..అసలు వీడియోను కత్తిరించి, వక్రీకరించిన వీడియో అని చెప్పింది. దీనిపై ట్విట్టర్ సంస్థ అభ్యంతరం తెలిపింది. సందర్భానికి దూరంగా తీశారని వ్యాఖ్యానించింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారంనాడు షేర్ చేసిన వీడియో ప్రకారం, రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు సెంట్రల్ హాలులో తన వీడ్కోలు సందర్భంగా ఆందరికీ నమస్కారం చేస్తూ ముందుకు వెళ్లారు.
ఆయన నమస్కరిస్తుంటే మోదీ పట్టించుకోనట్టుగా వేరే వైపు చూస్తున్నారు. ఆ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ ముందుకు కదిలివెళ్లారు. ఈ వీడియోకు సింగ్ కామెట్లు జోడించారు. ”ఇది చాలా అవమానకరం, వెరీ సార్ సార్. ఈ వ్యక్తులు అంతే, మీ పదవీకాలం పూర్తి కావడంతో ఇక మీవైపు కన్నెత్తి కూడా చూడరు” అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వీడియో వైరల్ అయింది.
ఫేక్ న్యూస్ పెడ్లర్ : బీజేపీ
ఆప్ షేర్ చేసిన వీడియోపై బీజేపీ వెంటనే స్పందించింది. సంజయ్ సింగ్‌ను ‘ఫేక్ న్యూస్ పెడ్లర్’ అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. సంజయ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు, ఎలాంటి కత్తెర్లు పడని  పూర్తి నిడివి వీడియోను ఆయన షేర్ చేశారు.
ఇందులో రామ్‌నాథ్ కోవింద్ నమస్కారానికి మోదీ ప్రతినమస్కారం చేయడం కనిపిస్తుంది. ఇతర పార్లమెంటేరియన్లకు కోవింద్ నమస్కారం చేస్తున్నప్పుడు మోదీ వేరేవైపు చూస్తున్నారు. అమిత్‌ మాలవీయ తన ట్వీట్‌లో ఆప్‌పై విరుచుకుపడ్డారు.
“ఈ వ్యక్తులు (కేజ్రీవాల్, సిసిడియో, తదితరులు) రోజూ అబద్ధాలు చెబుతూనే కనిపిస్తారు. అవమానించడం వీరికి అలవాటు. ప్రజలను ఎలా గౌరవించాలో వీళ్లు తెలుసుకోవాలి” అని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి మోదీని తక్కువ చేసి చూపించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని మరికొందరు బీజేపీ నేతలు సైతం ఆప్‌పై మండిపడ్డారు. సంజయ్ సింగ్‌  ”ఫ్యాక్ట్ చెక్” చేసుకోవాలని హితవు చెప్పారు.
కాగా, సంజయ్ సింగ్ ట్వీట్‌పై ట్విట్టర్ స్పందించింది. ఔట్ ఆఫ్ కాంటెస్ట్ అంటూ పేర్కొంటూ .. ఒక అడ్వయిజరీని జోడించింది. ప్రజలను పక్కదారి పట్టించడం, అయోమయంలో పడేయడం, హాని కలిగించే వీలున్న వాటిని షేర్ చేయవద్దని సూచించింది.
అభివృద్ధికి ఆటంకంగా ప్రతిపక్షాలు
సమాజం, దేశం ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని ప్రతిపక్షాలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు హర్మోహన్ 10వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ వర్చువల్ గా మాట్లాడుతూ  సిద్ధాంతాల పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా  అందరి ప్రయారిటీ దేశ ప్రయోజనాలే కావాలని హితవు పలికారు.
పార్టీలు, వ్యక్తులు దేశానికి వ్యతిరేకంగా మారకూడదని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయలేక పోయాయి. కానీ, ఇప్పుడు తమ  ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డంకులు తెస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. అప్పట్లో వారు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయలేదు. అవే నిర్ణయాలను ఇప్పుడు అమలు చేస్తుంటే దానిని వ్యతిరేకిస్తున్నారని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి రాజకీయాలను దేశ ప్రజలు ఇష్టపడరని ప్రధాని స్పష్టం చేశారు.
 దేశ కొత్త అధ్యక్షురాలిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన సమాజానికి చెందిన మహిళ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు అని కొనియాడారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప రోజని సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో 1971 యుద్ధం, అణు ప్రయోగం వంటి పలు సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి బాసటగా నిలిచాయని, ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కలసి ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాటం జరిపామని ప్రధాని గుర్తు చేశారు. అయితే నేడు అటువంటి వాతావరణం కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు.  దేశ ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలకే కొన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు.