లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్ పై వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ వేటు పడింది. 
 
ఆగస్టు 12 వరకు అనగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరిగేంత వరకు ఈ సస్పెన్షన్‌ ఉండనుంది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, మైదా, మజ్జిగ, పెరుగు వంటి వస్తువులపై జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.
ఈ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు.  అయితే.. నిరసన తెలియజేయాలనుకుంటే సభ బయట ప్లకార్డులు ప్రదర్శించాలని, సభలో ప్రదర్శించకూడదని స్పీకర్ ఓం బిర్లా సూచించారు.
 
మధ్యాహ్నం 3 గంటల తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నామని, తమ ఓపికను బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. నిరసన తెలపాలనుకుంటే.. పార్లమెంట్‌ బయట చేపట్టాలని, సభా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా ఎంపిలు సహకరించాలని సూచించారు.
 
 అయినప్పటికీ వారు నినాదాలు చేస్తుండటంతో నలుగురు ఎంపిలను సస్పెన్షన్‌ చేశారు.  అంతకుముందు సభ వాయిదా పడిన తర్వాత మరోసారి సభలోకి ప్లకార్డులతో వచ్చి నిరసన తెలియజేశారు.
దీంతో సభకు పదేపదే ఆటంకం కలుగుతుండడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్ష ఎంపీల తీరును ఖండించారు. సభలోకి ప్లకార్డులు తీసుకొచ్చిన కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు.  సస్పెండ్‌ వేటు పడిన తర్వాత.. ఈ నలుగురు ఎంపిలు పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ స్థూపం వద్ద నినాదాలు చేపట్టారు.