15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ద్రౌపది ముర్మూ

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ సోమవారం ప్రమాణం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. 
 
దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ  తనపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం  రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయని ముర్మూ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ భరోసా ఇచ్చారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
 
సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివాసీ గ్రామంలో పుట్టి, రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రం కాదని దేశ ప్రజల విజయమని ఆమె స్పష్టం చేశారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడకలతో తన రాజకీయం జీవితం ప్రారంభమైందని, 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రధమ పౌరురాలిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
 
ఓ సాధారణ ఆదివాసీ అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారని  గుర్తు చేస్తూ దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని  ఆమె  సంతోషం వ్యక్తం చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 
 
“నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ” అని ఆమె పేర్కొన్నారు. 
 
“ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా” అని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా ఆమె ప్రసంగించారు.   గత రాష్ట్రపతులందరూ ఈ పదవికి వన్నె తెచ్చారని కొనియాడుతూ  “రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి” అని చెప్పారు.
 
ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌ రంగాల్లో దేశం దూసుకెళ్తోందని చెబుతూ అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాల్సి ఉందని , ‘సబ్‌ కా ప్రయాస్‌ సబ్‌ కా కర్తవ్య్‌’ నినాదం ముందుకు వెళ్లాలని ఆమె చెప్పారు.  
 
ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపిలు, దౌత్య కార్యాలయాల సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమె పార్లమెంట్‌కు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ఘన స్వాగతం పలికారు.