ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ హిట్ లిస్ట్‌లో గిరిరాజ్ సింగ్

భారతీయ జనతా పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై ఉగ్రవాదులు కన్నేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ జాబితాలో ఉన్న పలువురు నేతల్లో ఆయన ప్రముఖంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో  నివేదిక వెల్లడించింది. 
 
ఉగ్రవాద సంస్థ ఐస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ సొంత మ్యాగజైన్‌ తాజా ఎడిషన్‌లో బీజేపీ నేతలపై దాడులకు సంబంధించి రాసిన కథనంపై హోం శాఖ అప్రమత్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ మాజీ ప్రతినిధి నూపర్ శర్మ ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు ఇస్లాం సంస్థలు అగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ పలువురు బీజేపీ నేతలపై, ముఖ్యంగా బీహార్‌కు చెందిన నేతలపై తమ ట్విట్టర్‌ ఖాతాలో బెదరింపులు చేస్తూ వస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో బీహార్‌లోని రైల్వే పోలీసులతో సహా అన్ని జిల్లాల ఎస్ఎస్‌పీలు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఖొరాసాన్ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్ట్ జాబితాలో గిరిరాజ్ సింగ్ ప్రముఖంగా ఉన్నారని ఐబీ తెలిపింది.
బీజేపీ నేతల్లో గిరిరాజ్ సింగ్ తరచు సంచలన వ్యాఖ్యలు చేయడంలో ప్రముఖంగా నిలుస్తుంటారు. ఇటీవల ఆయన కుల గణనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ప్రతిపాదిత కుల గణనలో బంగ్లాదేశీలను, రోహింగ్యాలను చేర్చవద్దని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన తెగేసి చెప్పారు.
వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్ల నుంచి ప్రయోజనాలు పొందుతున్న ముస్లింలను కూడా గుర్తించాలని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల విషయంలోనూ ఆయన దూకుడు ప్రకటనలు చేశారు. ఊరేంగిపులపై విమర్శలు చేసేవారిపై విరుచుకుపడ్డారు.
వీరివి జిన్నా, ఒవైసీ మనస్థత్వం ఉన్నవారితో పోల్చారు. ”రామనవమి ఊరేగింపులు ఈ దేశంలో కాకుండా పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, ఇతర దేశాల్లో చేసుకుంటారా? ఇది అన్యాయం” అంటూ గిరిరాజ్ సంఘ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.