ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా, జల్ జీవన్ మిషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. త్వరలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 రోజులపాటు నిర్వహించే కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేసి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇందుకు గాను గ్రామ పంచాయితీలు, మున్సిపల్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.
అంతేగాక ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ద్వారా వ్యాక్సిన్ అందించాలని, రైల్వే స్టేషన్లు,బస్సు స్టేషన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ అందించే సమయంలో అన్నిపాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు వంటి అన్ని విద్యా సంస్థలు తెరచి ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలక్టర్లు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు.
అలాగే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 11 నుండి 17 వరకూ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపరాడాలి) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు 6న ఢిల్లీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అమలు కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు.
అంతకు ముందు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలపై మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నిరంతరం స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టి ఈకార్యక్రమాన్నివిజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు