ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి ప్రమాదకరం

ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి ప్రమాదకరం
ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేరి గ్రామంలో నాలుగు లేన్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో శనివారం ఆయన మాట్లాడుతూ  ఉత్తర ప్రదేశ్‌లో రహదారుల అనుసంధానం లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనని ఆరోపించారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని తెలిపారు. అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రాష్ట్రం గొప్పగా పరివర్తన చెందుతోందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల చిత్రకూట్-ఢిల్లీ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయం ఆదా అవుతుందని తెలిపారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల కలిగే ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ అని వివరించారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహనాల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా యావత్తు బుందేల్‌ఖండ్‌లో పారిశ్రామిక అభివృద్ధి పుంజుకుంటుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. ప్రజలు, మరీ ముఖ్యంగా యువత తాయిలాల సంస్కృతి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ గొప్పగా పరివర్తన చెందుతోందని కొనియాడారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని, రహదారుల అనుసంధానం వేగంగా మెరుగుపడుతోందని చెప్పారు. గతంలో వీటి పరిస్థితి ఎలా ఉండేదో ఓసారి గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉత్తర ప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.
తాము కేవలం వర్తమానం కోసం నూతన సదుపాయాలను సృష్టించడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నామని ప్రధాని చెప్పారు.  ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. దీనికి రూ.14,850 కోట్లు ఖర్చయింది. 2020 ఫిబ్రవరి 29న  దీనికి మోదీ శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో దీని నిర్మాణం పూర్తయింది.
చిత్ర‌కూట్ జిల్లాలోని గోండా గ్రామం వ‌ద్ద ఎన్‌హెచ్‌-35తో ఈ హైవే క‌లుస్తుంది. ఆ త‌ర్వాత ఇటావా జిల్లాలోని కుద్రాలి గ్రామం వ‌ర‌కు ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. అక్క‌డ ఆగ్ర‌-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వేతో క‌లుస్తుంది. తొలుత దీన్ని నాలుగు లైనుల మార్గంగా నిర్మించారు. త‌ర్వాత ఆరు లైనులుగా మార్చే అవ‌కాశం ఉంది. చిత్ర‌కూట్‌, బాండా, మ‌హోబా, హ‌మిర్‌పూర్‌, జ‌లౌన్‌, ఔర‌యా, ఇటావా జిల్లాల మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తుంది.