ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. కొనసాగుతున్న అల్పపీడనం

వాతావరణ శాఖ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతుందని ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు,అనకాపల్లి, విశాఖపట్నం,తూర్పుగోదావరి,కోనసీమ, కాకినాడ,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఏన్టీఆర్‌,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు, బుధవారం అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బి.ఆర్‌అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పంపినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, చింతూరులో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌, తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్‌.పురంలో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం ఉన్నట్లు చెప్పారు. ఈ బృందాలు ఓబియమ్‌ బోట్స్‌ , లైఫ్‌ బాయ్స్‌ , లైఫ్‌ జాకెట్స్‌ , రోప్స్‌, ఆస్కా లైట్‌ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని ఆయన  సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు-, మోటర్‌ బోట్లు-, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఏన్టీఆర్‌, కృష్ణా జిల్లాల లోతట్టు- ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళొద్దని సూచించారు.