మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో షిండే విజయం 

మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా ఓటు వేశారు. 

మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్లు శాసనసభాపతి రాహుల్ నర్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు. షిండే- బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. మహారాష్ట్రలో కొత్త ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఎంపికయ్యే అవకాశం ఉంది.

 ‘‘షిండే ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. షిండే నమ్మకమైన శివసైనికుడు. అతను బాలాసాహెబ్ సిద్ధాంతానికి విధేయుడు’’ అని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. 

ఎస్పీకి చెందిన అబూ అజ్మీ, రయీస్ షేక్, ఏఐఎంఐఎం ఎమ్మెల్యే షా తారిఖ్ అన్వర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ, సేన ‘రెబెల్స్’, స్వతంత్రులు, ప్రహార్ పార్టీకి చెందిన దాదాపు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు పలికారు.

అంతకుముందు సీఎం ఏక్‌నాథ్‌ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్‌ గుర్తించారు. చిఫ్‌విప్‌గా తిరుగుబాటు నేత భరత్‌ గొగవాలేను నియమించారు.

షిండే శిబిరానికి చెందిన విప్‌ను పార్టీ విప్‌గా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 11న జాబితా చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఇతర పిటిషన్‌లతో పాటు ఈ పిటిషన్‌ను కూడా కోర్టు విచారించనుంది.