రూ. 96 కోట్ల నామా ఆస్తుల జప్తు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాకిచ్చింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌లో కేసులో మధుకాన్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం రూ. 96 కోట్ల విలువ చేసే 105 ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ శనివారం ప్రకటించింది. 

ఈ కేసుకు సంబంధించి గత ఏడాది జూన్‌లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు, సోదాలలో లభ్యమైన ఆధారాలతో ఈడీ ఆస్తులను జప్తు చేసింది.

మధుకాన్‌ కంపెనీ పేరుతో బ్యాంకుల నుంచి భారీగా రుణాలను తీసుకున్న కంపనీ యజమాని నామా నాగేశ్వరరావు ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

 ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ రుణానికి సంబంధించి నాగేశ్వరరావు పర్సనల్‌ గ్యారంటీర్‌గా ఉన్నారు. కేసు పూర్వాపరాలను, బ్యాంకర్లు ఇచ్చిన ఫిర్యాదులు, సేకరించిన ఆధారాల మేరకు ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది.