లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ ఎమ్మెల్యే జార్జ్ అరెస్ట్

సోలార్ ప్యానెల్ కేసులో నిందితురాలు ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు ఆధారంగా కేరళ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
కేరళ జనపక్షం నాయకుడైన పిసి జార్జ్ ఫిబ్రవరి 10న  తనను థైకాడ్‌లోని గెస్ట్ హౌస్‌కు ఆహ్వానించాడని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన తర్వాత, రాజకీయ నాయకుడి నుండి తనకు అనుచిత సందేశాలు వస్తూనే ఉన్నాయని ఆమె ఆరోపించింది. 
 
ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వెంటనే, కంటోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని బృందం జార్జ్‌ను అదుపులోకి తీసుకుంది.బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు స్వప్న సురేష్ ఆరోపణలకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ విచారిస్తున్న పిసి జార్జ్‌ను ఇక్కడి గెస్ట్ హౌస్ నుండి కంటోన్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
“నేనేమీ తప్పు చేయలేదు. నేను నా జీవితమంతా ప్రజా కార్యకర్తగా ఉన్నాను.  ఏ మహిళ కూడా నాపై వేధింపుల ఆరోపణ చేయదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది ముఖ్యమంత్రి  పినరయి విజయన్, ఇంతకుముందు నా నుండి సహాయం కోరిన మహిళ యొక్క ప్రతీకారం” అని జార్జ్ మ్యూజియం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నప్పుడు విలేకరులతో చెప్పారు.

ఊమెన్ చాందీపై లైంగిక వేధింపుల కేసులో సాక్షి వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారు మహిళ తనను అభ్యర్థించిందని, అయితే అందుకు తాను నిరాకరించడంతో ఆమె `ప్రతీకారం’గా ఈ ఫిర్యాదు చేసినట్లు  జార్జ్ ఆరోపించారు.

అతనిపై ఐపిసి సెక్షన్ 354 (ఎ) (లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మోపారు. ఆయన చర్యను తీవ్రంగా ఖండించిన వారిలో జర్నలిస్టులతో పాటు, సీనియర్ సీపీఎం నేత, విద్యాశాఖ మంత్రి వి.శివంకుట్టి కూడా ఉన్నారు. ముక్కోణపు పోరులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి చేతిలో ఆయన తన కంచుకోట అయిన పూంజర్‌లో ఓడిపోయారు.