కేసీఆర్…. పీవీ జయంతికి ఎందుకు రాలేదు?

రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని అంటూ మాజీ ప్రధాని పివి  నరసింహారావు జయంతి ఉత్సవాలకు ఎందుకు హాజరు కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
 
 ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు ఛరిష్మాను వాడుకుని లబ్ది పొందిన కేసీఆర్, ఎన్నికలయ్యాక ఆయనను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. పీవీ జన్మస్తలం వంగరను అభివ్రుద్ది చేస్తా, స్మారక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. 
 
 స్వర్గీయ పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ ను సందర్శించిన బండి సంజయ్ ఈ సందర్భంగా పీవీకి ఘన నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీవీ నర్సింహారావు బహుభాషా కోవిదుడు, మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు పాలించిన రాజనీతిజ్ఝుడు అని కొనియాడారు. 
 
 ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి తెలంగాణ లో జన్మించడం, అందులోనూ తమ  కరీంనగర్ జిల్లాకు చెందిన బిడ్డ కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.  మంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధానిగా ఉన్నత పదవుల్లో కొనసాగి ఎన్నో సేవలందించిన మహనీయుడు పీవీ అని గుర్తు చేశారు.
 
సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి, పేదల గురించి నిత్యం ఆలోచించిన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని స్పూర్తిగా తీసుకుంటామని తెలిపారు.