హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. 
 
కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
 
1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 21న అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ గా నియమితులయ్యారు. 
 
ఆ తర్వాత.. 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 అక్టోబర్  3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్  22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు.
 
దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు. తొలుత కేసీఆర్, తమిళిసై ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంగానే కనిపించారు. కేసీఆర్‌ను తమిళిసై పలకరించారు. కానీ కేసీఆర్ చూసీచూడనట్టుగా వ్యవహరించారు. కేసీఆర్ వ్యవహార శైలితో గవర్నర్ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్పాహారం సమయంలో మాత్రం ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నట్టే కనిపించింది.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. కేసీఆర్ గతేడాది అక్టోబరు 11న చివరిసారి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మళ్లీ ఇన్ని నెలలకు ఇప్పుడు హాజరు కాబోతున్నారు.