బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో  నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాలు జరిగే హెచ్ఐసిసి   నోవాటెల్ హోటల్ లో ఏర్పాట్లకు బీజేపీ నాయకులు సోమవారం

భూమి పూజ చేశారు. పార్టీ జాతీయ నేతలు శివప్రకాశ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ బీజేపీ కార్యవర్గ సమావేశాలను, ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు  కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

అక్కడనే,  రెవెన్యూ, పోలీసులు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, పార్కింగ్, ప్రతినిధులు బస చేసే భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమీక్షలో హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డిఓ చంద్రకళ  పాల్గొన్నారు.

మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జులై 3 సాయంత్రం ప్రధాని మోదీతో నిర్వహించబోయే  బహిరంగ సభపై రాష్ట్ర బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ  సభకు 10 లక్షల మందిని తరలించేలా సన్నాహాలుచేస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని కాషాయమయంగా మార్చేందుకు హార్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో నింపేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు బీజేపీ సభ కోసం మొత్తం 16 రైళ్లను రిజర్వు చేశారు. మౌలాలి, మల్కాజ్ గిరి రైల్వేస్టేషన్ల కు రిజర్వ్ చేసిన రైళ్లు వచ్చేలా ప్లాన్ వేశారు.రైళ్లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలను రిజర్వ్ చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి ప్రజల ను తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని సభకు తరలించాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు పార్టీ ఆదేశాలు జారీచేశారు. ప్రధాని మోదీ బహిరంగసభతో రాష్ట్రంలో సత్తా చాటుతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. కేసీఆర్ సర్కార్ నియంత పాలనను ప్రజలు సాగనంపుతారని స్పష్టం చేశారు. 8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారమయంగా మారిందని ఆమె ఆరోపించారు.