ప్రభుత్వ తాజా ఉత్తర్వుల వివరాలు కోరిన మహా గవర్నర్

మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అత్యధికంగా తిరుగుబాటు చేసిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆరా తీస్తున్నారు. జూన్ 22-24వతేదీల మధ్య క్లియర్ అయిన ఫైళ్లు, ప్రతిపాదనల వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మంత్రాలయంలో హడావుడిగా పలు ఫైళ్లను క్లియర్ చేసి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ కోష్యారి ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, జీఓల వివరాలను పంపించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ను గవర్నర్‌ కోష్యారి కోరారు.
 ఈ మేర  గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సోమవారం లేఖ అందుకున్న ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి డేటాను క్రోడీకరించాలని కోరారు.శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ గతంలో కోష్యారీకి రాసిన లేఖలో ప్రభుత్వ జీఓలపై ఫిర్యాదు చేశారు.‘
‘గత 48 గంటల్లో 160 ప్రభుత్వ ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది, ఈ ఉత్తర్వులు అనుమానాస్పదంగా ఉన్నాయి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని ప్రవీణ్ దారేకర్ గవర్నరుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 మరోవంక, అనర్హత నోటీసులపై ప్రతిస్పందన దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు గడువును పొడిగించడంతో, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు బృందం గవర్నర్‌ను కలసి సభలో బలపరీక్షకు ఆదేశింపమని కోరడానికి వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసును షిండే “బాలాసాహెబ్ హిందుత్వ విజయం”గా అభివర్ణించారు.శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తేనే.. ముంబై తిరిగి వస్తామని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు  గవర్నర్ ను కోరే అవకాశం ఉందని తెలుస్తున్నది.